బైబిలు యొక్క దేవుడే
విశ్వానికి
ఏకైక న్యాయాధిపతి
ప్రేమగల పరిశుద్ధ దేవుడు
“నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు. “- మత్తయి 5:44-45
బైబిలు దేవుడు వివరించుటకు అద్భుతమైన అమోఘమైన దేవుడు మరియు ఆయన యొక్క స్వభావము విశ్వములో మరి ఎవరితో పోల్చుటకు సాటిలేనిది. మరియు ఈ బైబిలు దేవుడే విశ్వమంతటికి మూలాధారము. ఆయన అందరికి జీవమిచ్చే మరియు తనకు తానే స్వీయ ఉనికి కలిగి ఉన్నవాడు మాత్రమే కాదు ఆయన దీర్ఘ శాంతము గలవాడు, కనికరముగలవాడు, కృపగలవాడు, సౌమ్యమైన వాడు మరియు విశ్వమంతటిని సంరక్షించే దయామయుడు.
దేవుడు సమస్త న్యాయమును జరిగించి ఈ ప్రపంచంలో ఉన్న సమస్త దుర్నీతిని అంతము చేసే దినములు అతి త్వరలో రాబోతున్నాయి. ఈ భూమి మీద ఉన్న బీదవారియొక్కయు, అవసరతగలవారి యొక్కయు, సాత్వికమైన వారి యొక్కయు మరియు తగ్గింపుగల వారియొక్కయు ప్రార్థనలకు సమాధానమిచ్చే దినములు అతి త్వరలో రాబోతున్నాయి. ఎక్కడైతే జీవము మరణమును జయిస్తుందో మరియు ఎలోహీము భక్తుల యొక్క నిత్యజీవము ఎడతెగని యౌవ్వన బలముతో నిండి ఉంటుందో ఆ నూతన భూమి యందే సత్యము, నీతి న్యాయములు, శాంతి సమాధానములు మహా జలముల వలె మరియు వరదవలె పొంగి పొర్లి పారుతాయి.
సజీవుడైన దేవుడు మనుష్యులను తన యొక్క స్వంత ప్రేమా స్వరూపమైన పోలికలో చేసి వారిని నిత్యము జీవించమని దీవించాడు. కాని మనిషి తనకు తాను దేవుని వలె అవ్వాలనే దురాశ చేత తన హృదయాన్ని అనుసరించి, దేవుడికి అవిధేయత చూపించి, దేవుడిని కించపరిచి పాపము యొక్క పరిణామాలు అయిన వేదనను, వ్యథను మరియు మరణమును అనుభవించడాన్ని ఎంచుకున్నాడు.
పాపమనేది దేవునితో మరియు ఆయన యొక్క ధర్మశాస్త్ర వాక్యముతో పోరాడే మన శరీరములో ఉండే ఒక స్వభావము లేక దుర్గుణము.
కీర్తనలు 119:105 “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.”
సామెతలు 6:23 “ఆజ్ఞ దీపముగాను ధర్మశాస్త్రము (ఉపదేశము) వెలుగుగాను ఉండును.”
పై వాక్యములో ఉపదేశము అని తప్పుగా తర్జుమా చేయడం జరిగింది. అక్కడ ఉపయోగించిన హెబ్రీ పదము “తోరా” అనగా ధర్మశాస్త్రము అని భావము.
రోమీయులకు వ్రాసిన పత్రిక 7:7-14,17,20,25 “కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పనియెడల దురాశయను ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసికొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు నాకు కనబడెను. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసికొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది. ఉత్తమమైనది నాకు మరణకరణ మాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమ మైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయెను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై యున్నాను. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు.నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. మన ప్రభువైన ఏసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవధర్మశాస్త్రమునకును, శరీర విషయములో పాప నియమముకును(ధర్మశాస్త్రమునకును ) దాసుడనై యున్నాను.”
పై వచనములలో 25వ వచనము చూసినట్లయితే అక్కడ దైవ నియమము అని తర్జుమాదారులు తర్జుమా చేసారు. కాని అక్కడ ఉపయోగించిన గ్రీకు పదము నోమోస్ అనగా ధర్మశాస్త్రం అని భావన.
రోమీయులకు వ్రాసిన పత్రిక 8:7,8 “ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.”
దేవుడు మనలను ప్రేమతో జీవించమని ఆజ్ఞాపించాడు. కాని పాపము ద్వేషించి చనిపోమని దేవునితో పోరాడుతుంది. కాని విశ్వమంతటికి నిజమైన దేవుడు అయినటువంటి నీ యొక్క దేవుడు మరియు నాయొక్క దేవుడు మనము చనిపోవాలని కోరుకోలేదు. కాబట్టి ఆయన ఇలా పిలుస్తున్నాడు.
యేహెజ్కేలు 33:11 “కాగా వారితో ఇట్లనుము నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు: దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును. కాగా ఇశ్రాయేలీయులారా మనస్సు త్రిప్పుకొనుడి. మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.”
యెషయా 27:2-5 “ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును. దాని గూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను. నాయందు క్రోధము లేదు. గచ్చపొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నుండిన యెడల యుద్ధము చేయువానివలె నేను వాటిలోనికి వాడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఈలాగు జరగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను. నాతో సమాధానపడవలెను వారు నాతో సమాధానపడవలెను. ”
మనము ప్రభువైన యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి దేవుడను మమ్ములను నడిపించుమని పిలవడము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడతాము.
యెషయా 29:18-21 “ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. అంధకారము కలిగినను గాడాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుష్యులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలాత్కారులు లేకపోవుదురు. పరిహాసకులు నశించెదరు. కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించువానిని పట్టుకొన వలెనని ఉరి నొడ్డుచు మాయమాటలచేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు.”
కీర్తనలు 12:5 “బాధపడువారికి చేయబడిన బలాత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పును బట్టియు నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకోనువారికి నేను రక్షణ కలుగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.”
కీర్తనలు 72: 4,12-13 “ప్రజలలో శ్రమనొందువారికి అతడు న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి వారిని బాధపెట్టు వారిని నలుగ గొట్టును. దరిద్రులు మొర్రపెట్టగా అతను వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును.”
అలాగే బీదలను, అవసరత గలవారిని, అనాథ పిల్లలను, విధవ రాండ్రను జాగ్రత్తగా చూసుకోమని ఇంకా బైబిలులో అనేక లేఖనాల ద్వారా దేవుడు ఆజ్ఞాపించాడు. కాని ఈ రోజున చాలా మంది వారిని కొల్ల గొట్టి వారి వారి సొంత ప్రయోజనలకు దుర్వినియోగపరచుకుంటున్నారు. ఇది అతి త్వరలో అంతము కాబోతుంది. ఇది శాశ్వతముగా అతి త్వరలో అంతమవుతుంది. ఏలయనగా బైబిలు యొక్క దేవుడు మాత్రమే ఈ లోకమునకు మహోన్నతమైన న్యాయమైయున్నాడు మరియు న్యాయాధిపతియై యున్నాడు. మహా దేవుడు పలికాడు. ఆయన జరిగిస్తాడు.
నిరీక్షించే దేవుడు
కాగా ప్రభువైన దేవుడు మీరు పశ్చాత్తాప పడి మారు మనస్సు పొందాలని మీ కోసం వేచి చూస్తున్నాడు. అలా మారు మనస్సు పొందిన వారు దేవుడు తన సొంత నోటితో పలికి తన సొంత చేవ్రాతతో లిఖించిన మరియు ప్రతియొక్కరి జీవమునకు అనుగ్రహించిన పది ఆజ్ఞలను పాటించాలని దేవుడు మీ కోసం ఎదురు చూస్తున్నాడు. కాగా ఈ పది ఆజ్ఞలను పాటించడమే మీరు ఆత్మానుసారమైన నవీనస్థితిలో నడుస్తున్నారని మరియు మీ మనస్సు ద్వారా మీరు దేవుని ధర్మశాస్త్రమునకు విధేయత చూపిస్తున్నారని నిరూపితము.
కాగా ఎవరూ నశించకూడదని ప్రతి యొక్కరికొరకు దేవుడు వేచియున్నాడు.
2 పేతురు 3:9 “కొందరు ఆలస్యమని ఎంచుకొనునట్లు ప్రభువు తన వాగ్ధానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారు మనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘ శాంతము గల వాడై యున్నాడు. ”
యెషయా 30:18 “కావున మీయందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యముచేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి యున్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకొను వారందరు ధన్యులు.”
హేబ్రీయులకు 10:28-31 “ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన యెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండ వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును? పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము.”
ఈ భూమి మీద జీవితము ఆట కాదు, ఈ జీవితముకు అర్థముంది,ఉద్దేశ్యముంది మరియు గమ్యముంది. మనము దైవిక ధర్మమును నెరవేర్చడానికి ఈ భూమి మీద జన్మించాము. మనము ఈ భూమ్మీద మనము సృష్టించ బడిన కర్తవ్యమును నెరవేర్చుట కొరకు, చెడు అనేది లేకుండా మంచి మాత్రమే చేయుటకు, అందరిని పక్షపాతము లేకుండా ప్రేమించుటకు, బీదలకు, అవసరతగల వారికి , బాధపడు వారికి సహాయం చేయుటకు మరియు మనకు ఉన్నటువంటి తలాంతులను బలహీనమైన వారిని బలపరుచి వారికి ఉపయోగ పడుటకు మనము ఉన్నాము.
అంతేకాని మంచి చెడులను ఆలోచించకుండా మీరు ఏదైనా స్వంతగా ఊహించి, కనిపెట్టి, కోరుకొని చేసినట్లైతే అది మరణానికి దారి తీస్తుంది. ఈ జీవితము మీరు జీవించినంత వరకే మీది, కాని దేవుడు బహుకరించిన ఈ జీవితమును దుర్వినియోగపరచినట్లైతే దేవుడు దానిని వెనక్కి తీసుకుంటాడు మరియు మీ అంతము మరణము.
మనకు మన జీవమును దేవుడి దగ్గర నుండి తీసుకుని మన దగ్గరే పెట్టుకునే అధికారం గాని శక్తి గాని లేదు. ఇవ్వడము తీసుకోవడము అంతా దేవుని శక్తిలోనే ఉంది. మన దేహములో మనము చేసిన ప్రతి పని అనగా అది మంచిదే గాని చెడ్డదే గాని ప్రతీది దేవుని తీర్పులోనికి తేబడుతుంది మరియు దేవుడు దానిని బట్టే మనకు ప్రతిఫలమిస్తాడు. అది వరమే కాని శిక్షయే కాని మన శరీరక్రియలను బట్టే మనకు తగినది సంభవిస్తుంది. కాగా దేవుని చేత శిక్షించబడుట భయంకరము.
రోమీయులకు 6:23 “ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావారము మన ప్రభువైన క్రీస్తుయేసు నందు నిత్యజీవము.”
జీవ వరమును పొందుటకు కేవలం ఒకే ఒక్క మార్గము మాత్రమే ఉంది. మరియు అది ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే.
యోహాను 14:6 “యేసు నేనే మార్గము, సత్యము, జీవము” అనెను.
జీవము మాత్రమే జీవించే జీవితమును ఇవ్వగలదు. యేసు క్రీస్తు మాత్రమే జీవము మరియు ఆయనను తిరస్కరించడం ద్వారా మీరు జీవము లేని మరణాన్ని పొందుతారు.
భవిష్యత్ ప్రవచనముల దేవుడు
దేవుడు మనకు అప్పగించిన కర్తవ్యాలలో మనలను నిరాధారులనుగా వదిలి వేయలేదు. దేవుడు మనకు అప్పగించిన పనిలో మనo నిర్వర్తించాల్సిన బాధ్యతలను కూడా ఆయన ముందే చెప్పాడు. బైబిలు చాలా స్పష్టంగా ఉంది.
- కడవరి వర్షం ధారాళంగా కురవబోతుంది. గొప్ప స్వరము ఇంకా బిగ్గరగా వినబడుతుంది(ప్రకటన గ్రంథము 14:6-11, ప్రకటన గ్రంథము 18:1-5). ఈ వర్తమానము ప్రాముఖ్యముగా భూమి మీద ఉన్న ప్రతి యొక్కరు వారు జీవముగల దేవుడైన బైబిలు దేవుడికి లోబడతారో లేక అబద్ద దేవుళ్ళకు మూలము అయిన సాతానుకు లోబడతారో అని నిర్ణయించుకునే క్రూర మృగము యొక్క ముద్ర చట్ట అమలును కలిగి ఉండడమే కాకుండా ఆ క్రూర మృగము యొక్క ముద్రను వేయించుకోవడం వలన వారు దేవుని తీర్పు అయినటువంటి 7 తెగుళ్ళను పరిణామాలుగా అనుభవించబోవుచున్నారు అనే హెచ్చరిక ఈ వర్తమానములో కలిగి ఉంది. మరి ఎక్కువ వివరములకు https://remnantofgod.org/mark.htm సంప్రదించగలరు.
- అంతే కాక సాతాను ప్రభువైన యేసు క్రీస్తు లాగా మారు వేషము వేసుకుని వచ్చి ఆయనే మేస్సీయాగా నటించి అనేకులను మోసం చేస్తాడు(2 తెస్సలోనీయులకు 2:3-10, ప్రకటన గ్రంథము 16:13-14).
- సాతాను వాతావరణ మార్పును మరియు భూతాపాన్ని తగ్గించడానికి ఆదివార లేక భానువార చట్టాలను(చట్టముగా చేయబడిన ఆదివార విశ్రాంతి దినమే క్రూర మృగము యొక్క ముద్ర) ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తాడు(ప్రకటన గ్రంథము 13:16-18; 14:9-12).
- చాలా మంది ఇష్టపూర్వకంగా ఆదివార చట్టాలను అనుసరిస్తారు అనగా వారు కౄర మృగము యొక్క ముద్రను వారి వారి నొసళ్ళ మీద వేయించు కొనిన వారైయున్నారు. కొంతమంది బలవంతముగా ఆదివార చట్టాలను అనుసరిస్తారు అనగా వారు కౄర మృగము యొక్క ముద్రను చేతి మీద వేయించుకొనిన వారైయున్నారు(ప్రకటన గ్రంథము 13:16-18).
- అమలు చేయబడిన ఆదివార లేక భానువార చట్టాలు పది ఆజ్ఞలు పాటించే వారిని కొనుగోళ్ళు అమ్మకాలు చేయకుండా నిషేదిస్తాయి. ఇలా ప్రతి వ్యక్తి యొక్క కొనుగోళ్ళ అమ్మకాల నిషేధం కేవలం డబ్బును ద్రవ్యరూపకంగా తొలగించి డిజిటల్ చేయడం ద్వారా నియంత్రిస్తారు. అంతే కాకుండా వారు సాతానును అబద్ద యేసు క్రీస్తు అని బయలు పరచినందుకు మరియు రాబోయే దేవుని 7 తెగుళ్ల గురించి హెచ్చరించినందుకు వారు హింసించబడి శిరచ్చేదన చేయబడతారు(దానియేలు 7:25, ప్రకటన గ్రంథము 13:16-18;20:4).
- ఈ ఆదివార చట్టాలు అమలు చేసినా కూడా వాతావరణ మార్పు వలన ఉపద్రవాలు ఇంకా శరవేగంగా పెరుగుతాయి(యెషయా 24:5, రోమీయులకు 8:22).
- ఈ వాతావరణ విపత్తులు విపరీతంగా పెరగడం వలన ఆ నిందను శనివార విశ్రాంతి దినముతో సహా పది ఆజ్ఞలను పాటిస్తూ యేసు యొక్క విశ్వాసము(ప్రవచించే ఆత్మ) గల వారి మీద వేస్తారు. ఇశ్రాయేలు రాజైన ఆహాబు ఏలుబడి నందు 1రాజులు 17 వ అధ్యాయములో ప్రవక్తయైన ఏలియాకు మరియు 7000 మందికి ప్రవక్తలకు ఏమి సంభవించిందో అదే శేషించిన 144000 మందికి సంభవిస్తుంది. దేవుడు వారిని తనకొరకు సంరక్షించు కొంటాడు మరియు వారే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడకు ఆయన ముందు నిలబడగల సమర్థులు(ప్రకటన గ్రంథము 6:17, ప్రకటన గ్రంథము 7:1-8, కీర్తనలు 109:1-5; 59:1-5, ప్రకటన గ్రంథము 14:12).
- సాతాను లోకాధికారులతో కలిసి శనివార విశ్రాంతి దినమును పాటిస్తూ పది ఆజ్ఞలను పాటించేవారిని ప్రపంచమంతా ఐక్యమై వారిని హార్మగెద్దోను యుద్ధములో నాశనం చేయుటకు ఒక బిల్లును ఆమోదిస్తాడు(ప్రకటన గ్రంథము 16:13-16). ఈ ప్రపంచాన్ని ఐక్యం చేయడం కొరకు ప్రపంచాన్ని పది రాజ్యాలుగా చేసే నూతన ప్రపంచ క్రమమును ఏర్పాటు చేస్తారు(ప్రకటన గ్రంథము 17:12-14). దీని గురించి ఇంకా ఎక్కువగా తెలిసికొనుటకు https://remnantofgod.org/Rev17.12.htm సంప్రదించగలరు.
- ఆ బిల్లు యొక్క ఆమోదముతో కృపా కాలము సమాప్తమౌతుంది. దేవుని యొక్క తీర్పులు అయినటు వంటి చివరి ఏడు తెగుళ్ళు భూమ్మీద ఉన్న పరలోక తండ్రి యొక్క నామము నుదిటి మీద కలిగి ఉన్న శేషించిన 144000 విశ్రాంతి దినమును పాటించే వారి మీద తప్ప మిగతా అందరి మీద కురిపించ బడతాయి. ఈ భయంకరమైన తెగుళ్ళు ఒక్క సంవత్సరం పాటు కొనసాగుతాయి (ప్రకటన గ్రంథము 22:11, ప్రకటన గ్రంథము 14:1-5, ప్రకటన గ్రంథము 18:8). అలాగే బైబిలు ప్రకారము ఒక ప్రవచన దినము అంటే ఒక్క సంవత్సరముతో సమానము అని భావము. అది మనము యెహెజ్కేలు 4:6 మరియు సంఖ్యాకాండము 14:34 నుండి నేర్చుకొన గలము. తెగుళ్ల గురించి ఇంకా వివరముగా తెలిసికొనుటకు https://remnantofgod.org/7plagues.htm సంప్రదించగలరు.
- ప్రపంచాన్ని ఇక్యం చేసి శేషించిన 144000 మందిని చంపడానికి ఆమోదించబడిన ఏక ప్రపంచ ప్రభుత్వము యొక్క బిల్లు 6వ తెగులు చివరిలో అమలు చేయబడుతుంది. బైబిలు ఈ ఏక ప్రపంచ ప్రభుత్వము గురించి ముందే చెప్పింది మరియు అలాగే ఈ నూతన ప్రభుత్వము కేవలము ఒక ప్రవచన గంట మాత్రమే ఉంటుంది అనగా కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుంది(ప్రకటన గ్రంథము 12:17, ప్రకటన గ్రంథము 17:12).
- 7వ తెగులు కుమ్మరించ బడుతుంది. దుష్టులచే ముట్టడి వేయబడిన తన భక్తులను రక్షించుటకు ప్రభువైన యేసు క్రీస్తు సింహాసనము మీద ఆసీనుడై యున్న తండ్రి దేవుడుతో పాటు తన దూతల సైన్యములతో తిరిగి వస్తాడు(ప్రకటన గ్రంథము 17:17-21, ప్రకటన గ్రంథము 11:18-19, ప్రకటన గ్రంథము 6:14-17).
- ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ యందు బైబిలు యొక్క జీవముగల దేవునికి చెందిన వారు తమ తమ సమాధులలో నిద్రిస్తున్న భక్తులు నిత్య జీవము అను వరము పొందుకోడానికి మొదటి పునరుత్దానము చేయబడతారు. వారితో పాటు శేషించిన 144000 మంది రూపాంతరము చెంది ఆకాశములో పునరుత్దానము అయిన వారితో కలిసి కొంటారు(ప్రకటన గ్రంథము 20:4-5, 1 కొరింథీయులకు 15:42-45,51-52, 1 థెస్సలోనీయులకు 4:15-17 ).
- ప్రభువులకు ప్రభువును మరియు రాజులకు రాజు నైన యేసు క్రీస్తుతో పాటు తన యొక్క భక్తులు 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు(ప్రకటన గ్రంథము 20:4-5).
- 1000 సంవత్సరములు గడచిన తరువాత నూతన యెరూషలేము పట్టణము భూమి మీదకి దిగి వస్తుంది. మరియు పాపులు అవిశ్వాసులందరు తీర్పు తీర్చబడి నరకాగ్ని చేత రెండవ మరణములో నాశనము చేయబడతారు(ప్రకటన గ్రంథము 20:7-15, ప్రకటన గ్రంథము 21,22).
- చివరిగా నాశనం చేయబడే శత్రువు మరణము. అటు తరువాత మనము ఆరోగ్యముతో, బలముతో, శక్తితో ఎటువంటే రోగము, దుఖము, వేదన, నొప్పి, కన్నీరు అనేవి లేకుండా నూతన యెరుషలేములో జీవిస్తాము(1 కోరింథీయులకు 15:26, ప్రకటన గ్రంథము 21:4). మరియు మనము ఇంక ఎప్పటికి సర్వ శక్తి మంతుడగు ప్రభువైన దేవుడితో ఉంటాము.
ఈ విశ్వము యొక్క జీవము గల నిజ దేవుడు మనకు కావలిసినవన్ని తన పుస్తకమైన బైబిలులో బయలు పరచాడు. ఈ మహా ప్రేమ కలిగిన దేవుడు మనము బాధ పడాలని అస్సలు కోరుకోలేదు. కాని మనము మన శరీరాన్ని సంతోష పరచు కోవడం కొరకు దేవునికి విధేయత చూపించకుండా బాధలు పడుతున్నాము. కాబట్టే మనము దాని పరిణామాలను అనుభవిస్తున్నాము.
దేవుడు ఆత్మయై ఉన్నాడు గనుక మీరు పశ్చాత్తాప పడి మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకొని నవీన ఆత్మతో నూతన సృష్టి వలె జీవించాలి. మీరు దేవుని పది ఆజ్ఞల ధర్మశాస్త్రమును అతిక్రమించి పరలోకమునకు వెళ్ళలేరు. ఎందుకనగా ప్రతి కార్యము కూడా ఆకాశములో ఉన్న నిబంధన మందసములో ఉన్న పది ఆజ్ఞలను బట్టే తీర్పు తీర్చబడేది.
ప్రకటన గ్రంథము 11:18-19 “జనములు కోపగించి నందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్దులకును, నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్ప వారేమి, కొద్ది వారేమి, భూమిని నశింప జేయు వారిని నశింప జేయుటకును సమయము వచ్చి యున్నదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.”
దేవుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క రక్షణ ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత నిర్ణయము మీద ఆధారపడి ఉంటుంది. మీరు దేవుడిని గనుక హృదయపూర్వకముగా నమ్మినట్లితే, మీరు ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా రక్షింపబడడానికి సాకుల గురించి కనీసం ఆలోచించను కూడా ఆలోచించరు. మీ యొక్క నిర్ణయములకు మీరే బాధ్యులు. మేము కూడా మిమ్మల్ని మా హృదయ పూర్వకంగా వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాము. అలాగే దేవుడు మిమ్మల్ని జ్ఞానముతో, వివేకముతో, వివేచనా శక్తితో మరియు శాంతి సామాధనములతో దీవించి మరియు తన యొక్క కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క త్యాగము ద్వారా తాను చూపించిన అతి గొప్ప ప్రేమను చూడగల కన్నులు, వినగల చెవులు, గ్రహించగల హృదయమును మీకు అనుగ్రహించాలని మనస్సారా ప్రార్థిస్తున్నాము!
మీకు సమాధానము కలుగును గాక!
దేవుడు మిమ్మల్ని దీవించును గాక!